ఆర్టిసి డిపో మూసివేత ప్రయత్నం మానుకోవాలి
- జాయింట్ యాక్షన్ కమిటీ
ప్రజాశక్తి - కావలి : బస్సులను తగ్గించి, డ్రైవర్లను ఇతర ప్రాంతాలకు వలస పంపి, ఆతర్వాత కావలి ఆర్టిసి బస్సు మూస వేయాలనుకున్న డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు దుర్మార్గపు ఆలోచనను తక్షణం మానుకోవాలని కోరుతూ ఆర్టిసి కార్మిక సంఘాలు ఎస్డబ్ల్యుఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల ఆధ్వర్యంలో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్టిసి డిపో ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించి, నూతన డ్యూటీ ఛార్టులు వేయాలన్నారు. బెంగుళూరు సర్వీసులను పునరుద్ధరించి డబుల్ డ్రైవర్లతో బస్సులు తిప్పాలన్నారు. తిరుపతి ఒ.టి. సర్వీసులు వెంటనే రద్దు చేయాలన్నారు. ట్రాఫిక్ అనుభవం కల్గిన అసిస్టెంట్ మేనేజర్ను పిలిపించి, డ్యూటీ ఛార్టులు వేయాలన్నారు. కావలి-నెల్లూరు నాన్స్టాప్ సర్వీసులను రద్దుచేయడం మానుకోవాలన్నారు. రద్దుచేసిన నాన్స్టాప్ సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2022సంవత్సరంలో ఏవైతే ఛార్టు'కీ'లు ఉన్నాయో వాటి ప్రకారం ప్రస్తుత డ్యూటీ ఛార్టు వేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అవపసరమైతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి ఎస్డబ్లుఎఫ్ డిపో కార్యదర్శి పివిఎస్ ప్రసాద్, ఎంపాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వట్టికాల ప్రసాద్, డిపో అధ్యక్షులు బి.శ్రీను, నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో అధ్యక్షులు టి.ఆర్.ఎన్.రెడ్డి నాయకత్వం వహించారు.










