Jul 23,2021 15:19

అమరావతి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై కోర్టులో నేడు విచారణ జరిగింది. ఆగస్టు 2వ తేదీ లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు వాదనలు జరుగుతున్న సమయంలో.. కౌంటర్‌ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల సమయం కోరింది. అయితే, కౌంటర్‌ దాఖలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 29వ తేదీన బిడ్డింగ్‌కు కేంద్రం ముందుకు వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన కేంద్రం తరఫు న్యాయవాది.. అలాంటిదేమీ లేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.