Sep 23,2023 20:28

కందుకూరులో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-కందుకూరు :అంగన్‌వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాతగి మిగిలిందని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె రజియా విమర్శించారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండో రోజు శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం సబ్‌ కలెక్టర్‌ శోభిక కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాకు అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) కందుకూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు రాజేశ్వరి అధ్యక్షత వహించించారు. రజియా మాట్లాడుతూ మాట్లాడుతూ సిఎం ఎన్నికల సందర్భంగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదన్నారు. అంగన్‌వాడీలపై పనిభారం పెంచారన్నారు. కొత్తగా గర్భిణీలు, బాలింతలకు ఫేస్‌ యాప్‌ తీసుకొచ్చారన్నారు. ఫోన్లు పని చేయకపోయినా, నెట్‌ సిగల్‌ లేకపోయినా తప్పకుండా అమలు చేయాలని అధికారులు అంగన్‌వాడీలను మానసికంగా వేధింపులు గురిచేస్తున్నారన్నారు. సమస్యలపై ప్రభుత్వ స్పందించకపోతే ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డిఓ ఆఫీస్‌ సెంటర్‌ లో మానవహారం నిర్వహించారు. సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షులు వాకా లతారెడ్డి, వలేటివారిపాలెం మండల అధ్యక్షులు ఆర్‌ సరస్వతి, లింగసముద్రం మండల కార్యదర్శి బి.మార్తమ్మ, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఏ అనురాధ, కందుకూరు ప్రాజెక్టు కార్యదర్శి ఎస్‌ కే రహంతున్నీ సా,ఐద్వా కందుకూరు పట్టణ అధ్యక్షురాలు ఎం పద్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు జివిబి కుమార్‌, ఎస్‌.కె.గౌస్‌, సిఐటియు ఉలవపాడు మండల కార్యదర్శి ఎస్‌.డి. గౌస్‌ బాషా అంగన్వాడీల ధర్నాకు సంఘీభావంగా మాట్లాడారు.కందుకూరు, ఉలవపాడు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.