మధ్యప్రదేశ్ : అదనపు కట్నాన్ని తేవడానికి నిరాకరించినందుకు భార్యతో భర్త యాసిడ్ తాగించిన దారుణఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటుచేసుకుంది. గ్వాలియర్లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్కు ఈ ఏడాదిన శశి తో వివాహమైంది. వధువు తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చుతో ఘనంగా వివాహాన్ని జరిపించారు. ఇటీవల వీరేంద్ర కారు కొనుక్కోవడానికి రూ.3 లక్షల అదనపు కట్నాన్ని తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో భార్యాభర్తలిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వీరేంద్ర తన భార్యను కిందికి నెట్టి బలవంతంగా ఆమెతో యాసిడ్ తాగించాడు. బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె శరీరంలోని అవయవ భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మెరుగైన వైద్యం కోసం ఆమెను ఢిల్లీ ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక వైద్యులు చెప్పారు. భర్తని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.