
దేశంలో అధికార కేంద్రానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం ఎంత కష్టమో తెలియజెప్తున్న ఉదంతం. దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు జనాభా ప్రకారం చూస్తే అతి తక్కువ. అందులోనూ మహిళా క్రీడాకారులు మరీ తక్కువ. ప్రభుత్వం, సమాజం వారిని ప్రోత్సహించడం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. క్రీడల వైపు యువత చూడడం మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో మహిళా క్రీడాకారుల భద్రతకు పూర్తి భరోసా కల్పించగలిగినప్పుడే ముందు ముందు సత్ఫలితాలుంటాయి. పైగా ఎన్నో అవరోధాల్ని అధిగమించి తమను తాము రుజువు చేసుకున్న కొందరు క్రీడాకారులు తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం దృష్టికి తెస్తే సత్వరం స్పందించాలి. అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఏ పౌరుడికి అన్యాయం జరిగినా స్పందించాల్సిన తీరు ఇదే అయినా, కనీసం దేశానికి పతకాలు తెచ్చినవారికైనా ఆ గౌరవం ఇవ్వాలి. అది న్యాయం పట్ల, చట్టాల పట్ల, ప్రభుత్వం పట్ల పౌరుల్లో నమ్మకం పెంచుతుంది. కానీ ఇక్కడ జరిగిందేమిటి? కుస్తీ వీరుల బాగోగులు చూడాల్సిన అధ్యక్షుడు, తన పొజిషన్ ని దుర్వినియోగ పరుస్తూ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వారు నేరారోపణ చేశారు. ఇది ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు, ట్రయల్ ఎలా జరగాలో చట్టం స్పష్టంగా చెప్పింది. గతంలో విశాఖ మార్గదర్శకాలు కానీ, జస్టిస్ వర్మ రిపోర్ట్ గానీ మహిళల రక్షణకు ఎన్నో విలువైన సూచనలు కూడా చేశాయి. అయితే ఈ కేసులో ఉన్న నిందితుడు అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడు. కాబట్టి చట్టం చెప్పిన ప్రక్రియలన్నీ నిదానంగా సాగుతున్నాయి. కనీసం ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) పోలీసు స్టేషన్లో నమోదు కావడానికి సుప్రీం కోర్టు చెప్పాల్సి వచ్చింది. అభియోగ పత్రం నెలలు గడుస్తున్నా అయిపులో లేదు. అందుకనే ఆ క్రీడాకారులు, వారికి మద్దతుగా మరికొంత మంది ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. వారికి మద్దతుగా, రైతు సంఘాలు , 1983లో ప్రపంచ కప్ గెలిచిన క్రికెట్ టీమ్ తో సహా పౌరసమాజం ముందుకి వచ్చింది. ఇకనైనా వారి ఆవేదనని ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. నిందితుడి పవర్ని, పార్టీని చూడకుండా, వచ్చిన నేరారోపణ బట్టీ, చట్టం తన పని తాను చేసేలా చూడాలి. ప్రముఖులైన వారికే న్యాయం అందకపోతే సామాన్య పౌరుల మాటేమిటన్న సందేహం ప్రజలకు రాకూడదు.
- డా.డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.