Sep 13,2023 20:31

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైద్యారోగ్య, పంచాయతీరాజ్‌శాఖ సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి భరోసా ఇస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆయుష్మాన్‌ భవ కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.వేలకోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో ఆయుష్మాన్‌ భవ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేశామన్నారు. హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ స్టేట్‌ నోడల్‌ ఆఫీసరు కె శ్యామల, టిబి జాయింట్‌ డైరెక్టరు రమేష్‌, ఎన్‌హెచ్‌ఎం సిఎఒ గణపతిరావు, నిక్షరు మిత్రలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిఎం కృష్ణకుమార్‌, బి ప్రభు, ఎజిఎం పిఆర్‌పి సుబ్రమణ్యం, కనెక్ట్‌ టు ఆంధ్ర సీనియర్‌ కన్సల్టెంట్‌ కెబి ప్రశాంత్‌రెడ్డి, ప్రోగ్రామ్‌ ఆఫీసరు బండ్లమూడి ఎ ప్రసాద్‌, డాక్టర్‌ సమరం పాల్గొన్నారు. వీరందరినీ మంత్రి సన్మానించారు.