Jul 20,2022 07:58
  • ఆగస్టులో ట్రాన్స్‌ఫర్లు
  • ఉపాధ్యాయ సంఘాలతో చర్చల్లో మంత్రి బొత్స

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల తప్పనిసరి బదిలీ వ్యవధిని తగ్గిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అన్ని కేటగిరీలకు గరిష్ట సర్వీస్‌ కాలం ఐదేళ్లు ఉంటుందని, బదిలీలు ఆగస్టులో చేపడతామని అన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో ఎనిమిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. రెండేళ్లు ఒకచోట పనిచేసిన తరువాత కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ కావొచ్చు. అయితే ఇప్పుడు గరిష్ట కాలాన్ని తగ్గిస్తూ మంత్రి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. కనీస సర్వీస్‌ జీరో ఉంటుందని చెప్పారు. ఉన్నత పాఠశాలలో ప్లస్‌ 2 ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. ఈ నెల 7వ తేదీన ఇచ్చిన హామీల అమలును నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు.
 

                                                 జిఓ 117పై పరిశీలిస్తాం : ఫ్యాప్టోతో బొత్స

ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ జిఓ 117ను సవరణ చేయాలని, పాఠశాలలో 46 రోల్‌ను సెక్షన్‌గా పరిగణించాలని ఫ్యాప్టో కోరిన అంశాలపై పరిశీలిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. జిఓ 117 వల్ల ఉపాధ్యాయుల పోస్టులు మిగులుగా మారతాయని, దీనివల్ల విద్యార్థులకు నష్టమని ఫ్యాప్టో నాయకులు మంత్రికి వివరించారు. పాఠశాలల విలీనాన్ని ఆపాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని కోరారు. బదిలీల గరిష్ట సమయం ఎనిమిదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎలిమెంటరీ పాఠశాలల్లో 100 రోల్‌ కంటే ఎక్కువ ఉన్న చోట హెచ్‌ఎం పోస్టు కేటాయించాలని కోరారు. యుపి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా స్కూల్‌ అసిస్టెంట్లను కొనసాగించాలని, ఉన్నత పాఠశాలల్లో 10వ సెక్షన్‌ వద్ద హిందీ, పిఎస్‌ అసిస్టెంట్లను కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు రోల్‌ 10 దాటితే రెండు మాధ్యమాలను కేటాయించాలని కోరారు. హెచ్‌ఎం, పిడి, పిఇటి పోస్టులు తప్పకుండా ఉంచాలన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల జీతాలు ఈ నెల ఆలస్యం కాకుండా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని, సర్వీస్‌ రూల్స్‌ సవరణ చేసి అర్బన్‌ ఎంఇఒ, డిఇఒ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల ఉన్నత పాఠశాలల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. ఈ అంశాల సాధ్యసాధ్యాలను పరిశీలించి సవరణలు చేస్తామని మంత్రి చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఫ్యాప్టో ఛైర్మన్‌ ఎన్‌ వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌ మంజుల, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ వి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, జి హృదయరాజు, జివి నారాయణ రెడ్డి, ఎంవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఉన్నారు.