Sep 09,2023 17:02

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న నేపథ్యంలో విజయవాడలోని సిటీ కోర్టు కాంప్లెక్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న టిడిపి మహిళా కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వైపు రహదారుల్లో వెళ్లేవారిని తనిఖీ చేయడంతో పాటు ఆ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం.
అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు కఅష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి టిడిపి శ్రేణులు విజయవాడకు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే నారా లోకేశ్‌ రాజోలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.