Oct 07,2023 17:44

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినవన్నీ నిర్ధారించలేనివనీ, అవన్నీ బోగస్‌ అని న్యూస్‌క్లిక్‌ వెబ్‌పోర్టల్‌ ఎఫ్‌ఐఆర్‌ని తిరస్కరించింది. భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడానికి చేసిన కుట్రలో భాగంగానే చైనా నుండి పెద్ద మొత్తంలో న్యూస్‌క్లిక్‌ నిధులు స్వీకరించినట్లు ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఎప్‌ఐఆర్‌ నమోదు చేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా ప్రచార విభాగంలో సభ్యుడైన నెవిల్లే రారు సింఘం మోసపూరితంగా విదేశీ నిధులను న్యూస్‌క్లిక్‌కి సమకూర్చారని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. అయితే ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని న్యూస్‌క్లిక్‌ విమర్శించింది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ప్రబీర్‌పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తి అరెస్టులు జరిగాయని న్యూస్‌క్లిక్‌ ఆరోపించింది. చైనా లేదా చైనీస్‌ సంస్థల నుండి ఎటువంటి నిధులు లేదా సూచనలను స్వీకరించలేదు. న్యూస్‌క్లిక్‌ ఎప్పుడూ హింస వేర్పాటు లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడలేదు. లేదా వాటిని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు అని న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ శుక్రవారం ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించే న్యూస్‌క్లిక్‌ కవరేజీ పరిశీలన న్యూస్‌క్లిక్‌ యొక్క క్లెయిమ్‌ల వాస్తవికతను సూచిస్తుంది. దేశంలోని న్యాయవ్యవస్థపై న్యూస్‌క్లిక్‌కు పూర్తి విశ్వాసం ఉందని, తమ వైఖరిని సమర్థిస్తుందని నమ్మకం ఉందని న్యూస్‌క్లిక్‌ ప్రకటన పేర్కొంది.