Apr 23,2023 10:45

ముంబై : ముంబైలోన వాఖండే స్టేడియంలో నిన్న రాత్రి పంజాబ్‌-ముంబై మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 16 పరుగులు కావాలి.. ఆ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ మ్యాజిక్‌ చేశాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ వేగానికి మిడిల్‌ స్టంప్‌ రెండు సార్లు ముక్కలయింది. ఓవర్‌ మూడో బంతికి తిలక్‌ వర్మను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అతని బౌలింగ్‌ వేగం దాటికి మిడిల్‌ స్టంప్‌ ఎగిరి రెండు ముక్కలయింది. దీంతో అంపైర్‌ కొత్త స్టంప్‌ పెట్టాడు. ఆ తర్వాతి బంతికే నెహాల్‌ వదేరాను అర్ష్‌దీప్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో మరోసారి మిడిల్‌ స్టంప్‌ ఎగిరి రెండు ముక్కలయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • బీసీసీఐకి రూ.లక్షల్లో నష్టం

బీసీసీఐకి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఐపీఎల్‌లో ఎల్‌ఈడీ స్టంప్‌లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టంప్‌ల సెట్‌ ధర 40 వేల డాలర్లు అంటే దాదాపు 32.81 లక్షలు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండుసార్లు స్టంప్స్‌ విరగొట్టడంతో బీసీసీఐకి లక్షల్లో నష్టం వచ్చింది. బెయిల్స్‌ ను జింగ్‌ బెయిల్స్‌ అని పిలుస్తారు. బెయిల్స్‌ ధరను సెపరేట్‌ చేస్తే కేవలం స్టంప్స్‌ సెట్‌ ధర రూ. 24 లక్షలని అంచనా.