Jun 27,2022 10:48
  • పడిపోయిన షేరు ధరలు.. ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలు

న్యూఢిల్లీ : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) భారతదేశపు అతిపెద్ద ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) నష్టాలను చవి చూసింది. కంపెనీ షేర్ల ధరలు పడిపోవటంతో రూ.1.40 లక్షల కోట్లకు పైగా (18 బిలియన్‌ డాలర్ల) సంపద ఆవిరైపోయింది. దీంతో 'ఎల్‌ఐసి 2.ఓ' అధిక మొత్తం సంపదను కోల్పోయి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నది. ఎల్‌ఐసీ స్టాక్‌ శుక్రవారం రోజుకు 3.2 శాతం క్షీణించి రూ. 661.70కి పడిపోయింది. ప్రతి షేరుకు ఇష్యూ ధర రూ. 949 నుంచి 30 శాతం కంటే తక్కువగా ఉన్నది. దీంతో ఇది కాస్తా ఈ ఏడాది ఐపిఒలలో సంపదను ఆవిరి చేసిన వాటిలో ఒకటిగా ఇది మార్చింది. ముఖ్యంగా, ఈ ఏడాదిలో ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ ఐపీఓ ల గురించి ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఇప్పుడు అది కాస్తా నష్టాలను తీసుకురావటంతో వారు తీవ్ర నిరాశ చెందారు. నష్టాల పరిణామాన్ని వివరించాలంటే మే 17 నుంచి విలువలో దాదాపు మూడో వంతు పడిపోయింది. ఎల్‌ఐసీ ఐపీఓ ప్రస్తుతం క్యాపిటలైజేషన్‌ నష్టంలో ముందు వరుసలో ఉన్నది. '' ఎల్‌ఐసీ షేర్‌ ధరలలో తాత్కాలిక తగ్గుదల గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాం. ఎల్‌ఐసీ యాజమాన్యం ఈ అంశాలన్నింటినీ పరిశీలించి వాటాదారుల విలువను పెంచుతుంది'' అని డీఐపీఏఎం సెక్రెటరీ తుహిన్‌ కాంటా పాండే అన్నారు.
     స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఫ్లాప్‌ అరంగేట్రం చేసినప్పటి నుంచి స్క్రిప్‌ లిస్టింగ్‌ అయిన కొద్ది రోజులకే షేరు ధర కనిష్టంగా రూ. 650, గరిష్టంగా రూ. 920గా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ, అతిపెద్ద దేశీయ ఆర్థిక పెట్టుబడిదారుల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం-క్యాప్‌) శుక్రవారం రూ.4.2 లక్షల కోట్లకు పడిపోయింది. రూ. 949 ఇష్యూ ప్రైజ్‌ వద్ద కంపెనీ ఎమ్‌-క్యాప్‌ రూ. 6 లక్షల కోట్లకు కాస్త పైగా నిలిలిచింది. అయితే, పెరుగుతున్న వడ్డీరేట్లు, ప్రపంచ ద్రవ్యోల్బణ పరిస్థితితులు భారతీయ షేర్లకు విదేశీ డిమాండ్‌ను దెబ్బతీశాయి. ఇప్పటికే విదేశీయుల నుంచి అమ్మకాల ఒత్తిడిని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదుర్కొంటున్న భారత స్టాక్‌ మార్కెట్‌.. ఎల్‌ఐసీ షేర్లకు మరింత బాధను కలిగిస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు.