Oct 15,2023 17:01

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను కాపీ కొట్టి సీఎం కేసీఆర్‌ బిఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.''కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్‌ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారు. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ 51 మందికే బీఫారాలు ఎందుకిచ్చారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు చూడగానే సీఎం కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చింది. ఇతర పార్టీల మేనిఫోస్టోలను కాపీ కొట్టేందుకే ఆయనకు సమయం సరిపోతోంది. కేసీఆర్‌ నిరంతరం మద్యం, మైనింగ్‌, ల్యాండ్‌ మాఫియా ద్వారా ఎలా సంపాదించాలనే ఆలోచనలు చేస్తుంటారు. కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారు. స్వంతంగా ఆలోచన చేసే శక్తిని కేసీఆర్‌ కోల్పోయారు. పరాన్నజీవిగా మారిపోయారు. కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలు అసాధ్యం అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారు? ఒకప్పుడు కేసీఆర్‌ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారు. ఆలోచనలు క్షీణించిన కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ను అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతను బిఆర్‌ఎస్‌ నేతలు కోల్పోయారు. ఎన్నికల్లో ఓటర్లకు చుక్క మందు పోయకుండా, అణాపైసా పంచకుండా ఎన్నికల్లో కొట్లాడుదామని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసురుతున్నా. దీనిపై 17వ తేదీ మధ్యాహ్నం అమర వీరుల స్థూపం వద్ద .. మేం ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయబోమని ప్రమాణం చేస్తా. కేసీఆర్‌ కూడా వచ్చి ప్రమాణం చేయాలి'' అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.