
ప్రధాని కార్యాలయం అంతా హడావుడిగా ఉంది. ఈసారి తన మనసులోని మాట ఏమై ఉంటుందో ఊహించి ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా వేదికల్లో చర్చలకు పెట్టాలని పెద్దాయన ఆలోచిస్తున్నారట.
ఇంకేం! సోషల్ మీడియాకన్నా ముందే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నిద్రలేచాయి. వేడి వేడి డిస్కషన్లు, చర్చావేదిక లైవ్ ప్రోగ్రాములు ఎలక్ట్రానిక్ మీడియాలో హోరెత్తాయి. ఇక ప్రింట్ మీడియా తక్కువ తింటుందా! మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది! అది పెద్దాయన మనసు లోని మాట బయటపెట్టే రోజు. ఇంతకుముందు కూడా పెద్దాయన మనసులోని మాటలు చాలా చెప్పారు. కాని ఈసారి వందవ మన్ కీ బాత్ కావడంతో భక్త బృందం ఆనందానికి హద్దులు లేవు.
''మిత్రోు'' అన్నాడు పెద్దాయన. టీవీలు చూస్తున్నవారు, రేడియోలో వింటున్నవారు ఒక్కసారి నిశ్శబ్దమైపోయారు.
''మిత్రోు'' అన్నాడు మళ్ళీ పెద్దాయన.
''ఆగు పెద్దాయనా!'' అంటూ శబ్దం వచ్చింది. చూస్తున్న వారూ, వింటున్న వారూ ఆశ్చర్యపోయారు.
పెద్దాయన ముందు ఆశ్చర్యానికి..ఆ తర్వాత ఆగ్రహానికి లోనయ్యాడు. తన ఉపన్యాసానికి అడ్డు తగలటమా! ఎంత ధైర్యం? ఈ మనసులోని మాట వినటానికి మొత్తం ప్రపంచమే ఎదురు చూస్తుంటే.. ఆగమన్న అల్పజీవి ఎవరా అని అటూ ఇటూ చూశాడు! ఎవరూ కనబడలేదు. దాంతో మళ్ళీ ప్రారంభించ బోయాడు.
''మిత్రోు!'' అంటుండగానే మళ్ళీ ఆగమంటూ శబ్దం వచ్చింది. అటూ, ఇటూ చూడబోయాడు.
''అటూ, ఇటూ చూడొద్దు! ఆగమంటున్నది నేనే'' పెద్దాయన మాట్లాడుతున్న మైకు నుండే శబ్దం వచ్చింది.
గత పది సంవత్సరాలుగా నీ మనసులోని మాటలు వింటున్నాను. ప్రతిసారీ ఒక కొత్త సమస్యను ప్రస్తావించి, దానికి సమాధానమో వివరణో ఇస్తున్నారు. ఈసారి చిన్న మార్పు చేసుకుందాం! నా మనసులోని మాటలు మీకు చెబుతాను. ఆ మాటలకు మీ స్పందన ఏమిటో చెప్పండి'' అన్నది మైకు.
పెద్దాయనకు తన వాక్ ప్రవాహం మీదా, తన విజ్ఞానం మీదా తిరుగులేని నమ్మకం. అందుకే కానివ్వమంటూ ఎడమ చేయి ఊపాడు.
''అయితే ఒక షరతు! నేనడిగే ప్రతి మాటకు మీ మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పాలి! మీరు అబద్ధం చెప్పినా, నిజం బయటకు చెప్పకపోయినా మీరు శిలగా మారిపోతారు!'' అన్నది మైకు.
పెద్దాయన ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత సరేనన్నా తన శక్తి సామర్థ్యాల మీద అంత నమ్మకం మరి!
''దేశంలోని సహజ వనరులను, ఓడ రేవులను, విమానాశ్రయాలను, గోడౌన్లను ఆదానికి కట్టబెట్టడానికి మీ అధికారాన్ని వినియోగిస్తున్నారు! అదానీ కోసం నిబంధనలు మార్చుకున్నారు. అవసరమైతే చట్టాలు కూడా మార్చుతున్నారు. ఇటీవల ఆయనకు జిఎస్టి నుండి మినహాయింపు కూడా ఇచ్చారు! ఇదంతా దేనికోసం చేస్తున్నారు?'' అడిగింది మైకు.
పెద్దాయన తనకు అలవాటైన రీతిలో మౌనంగా ఉండిపోయాడు! 5నిమిషాలు గడిచాయి. చూస్తుండగానే పెద్దాయన తొడల వరకూ శిలగా మారిపోయాడు. మైకు మళ్ళీ ప్రారంభించింది.
''దేశ రక్షణకు సైనికులు తమ ప్రాణాలు పణంగా పెడతారు. గత ప్రభుత్వాలు, సైనికులను పట్టించుకోలే దని మీరు పలుమార్లు విమర్శించారు! కాని పుల్వామాలో సైనికుల ప్రయాణానికి మీ ప్రభుత్వాన్ని హెలికాఫ్టర్లు కోరితే నిరాకరించారు! దాంతో తీవ్రవాదుల కుట్రకు బలై 39 మంది వీరసైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమంతా మీకు తెలిసే జరిగిందని, మీ గవర్నరే స్వయంగా ప్రకటిస్తే, ఆయనపై సిబిఐ ఎంక్వైరీ పెట్టారు! పుల్వామా దుర్ఘటన గురించి మీ మనసు లోని మాట బయటకు చెప్పండి!'' అడిగింది మైకు.
మైకు అడిగింది విననట్లు చూశాడు పెద్దాయన. మైకు నుండి చిన్న నవ్వు వినిపించింది. ''మీకు వినిపి ంచింది! మాకు కావల్సింది మీ మనసులోని మాట!''
పెద్దాయన ఆలోచిస్తున్నాడు. ఐదు నిమిషాలు గడిచాయి. పెద్దాయన 56 అంగుళాల ఛాతీ వరకు శిలగా మారిపోయింది!
''ఇక చివరి ప్రశ్న! దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి, పతకాలు, అవార్డులు సాధిస్తే మీరు వెంటనే వారికి అభినందనలు తెలుపుతారు! వారితో ఫొటోలు దిగుతారు! వారి విజయానికి మీ ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తారు! మంచిదే కాని గత కొంత కాలంగా దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు, తమను ఒక ఎంపీ వేధిస్తున్నాడని నిరసన దీక్షలు చేస్తుంటే మీరు వారిని పిలిపించి మాట్లాడలేదు! వారికి మద్దతుగా ఒక్క ముక్క మాట్లాడలేదు! దేశానికి పతకాలు సాధించిన రెజ్లర్లకు అందునా మహిళలకు ఈ దేశంలో అవమానాలే జరుగుతాయా? మీ మనసులోని మాటను ఈ కార్యక్రమంలో తెలియచేయండి!'' కోరింది మైకు.
పెద్దాయన తల అటూ ఇటూ ఆడిస్తున్నాడు. మౌనం మాత్రం వీడలేదు. సమయం ముగిసింది. పెద్దాయన పూర్తి శిలగా మారిపోయాడు!
- ఉషాకిరణ్