Feb 05,2023 22:01

రన్నప్‌గా నంద్యాల నర్సింహారెడ్డి జోడీ
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ

హైదరాబాద్‌ : నాలుగు రోజుల పాటు క్రీడాస్పూర్తితో సాగిన 12వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆదివారం ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 339 క్రీడాకారులు పోటీపడిన మెగా ఈవెంట్‌లో పలు విభాగాల్లో సీడెడ్‌ అథ్లెట్లు సైతం టైటిల్‌ రేసులో నిలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం ఫైనల్లో గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ హరికఅష్ణ రెడ్డి, శశికళ జోడీపై 8-4తో విజయం సాధించి టైటిల్‌ సొంతం చేసుకున్నారు. మెన్స్‌ 50 ప్లస్‌ డబుల్స్‌ విభాగంలో హరి కఅష్ణ రెడ్డి, రియాజ్‌ జోడీ నంద్యాల నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌లపై 10-5తో విజయం సాధించారు. మెన్స్‌ 40 ప్లస్‌ డబుల్స్‌ విభాగంలో ప్రదీప్‌ కుమార్‌, శ్రీరామ్‌లు 10-7తొ శ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీకర్‌లపై అలవోక విజయంతో ట్రోఫీ సాధించారు. మెన్స్‌ 60 ప్లస్‌ డబుల్స్‌లో మెహర్‌ ప్రకాశ్‌, వి. శంకర్‌లు 10-9 (7-5)తో టైబ్రేకర్‌లో మనోహర్‌, రవిశంకర్‌లపై పైచేయి సాధించి టైటిల్‌ కొట్టారు. మెన్స్‌ 60 ప్లస్‌ సింగిల్స్‌లో మెహర్‌ ప్రకాశ్‌, మెన్స్‌ 70 ప్లస్‌ సింగిల్స్‌లో రామమోహన్‌ రావు, 50 ప్లస్‌ సింగిల్స్‌లో నీల్‌కాంత్‌లు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగం టైటిల్‌ పోరులో (30 ప్లస్‌ డబుల్స్‌) నీలం అగర్వాల్‌, నయనతార జోడీ 8-4తో సౌమ్య నాయుడు, అరుణ భాస్కర్‌లపై గెలుపొందారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఖమ్మం జిల్లా, సెషన్స్‌ జడ్జీ అపర్ణ, హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.