ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో జాప్యం తగదని మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఆర్సిలో గురువారం ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖధికారి వెంకటేష్ నాయక్, ఆర్.పి నరసారెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ పేరెంట్స్ కమిటీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల భాగస్వామ్యంతో పాఠశాలలో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల భౌతిక వనరులు, పరిసరాల పరిశుభ్రత, తరగతిగదులు, ఫర్నిచర్, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, పాఠశాల ఫైర్ సేఫ్టీ, పాఠశాలలో నిర్వహించు వివిధ రకాల పరీక్షలు గురించి సూచనలు చేశారు. సవరనాత్మక బోధన సహ పాఠ్య కార్యక్రమాలు, ఎన్.సి.సి, క్రీడలు, పాఠశాలలో పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు, ప్రథమ చికిత్స, పాఠశాలల్లోనూ.. వసతి గృహాలలోనూ అందించే భోజనం, జగనన్న విద్యాకానుక, గ్రంథాలయము, ప్రయోగశాల, బోధన అభ్యసన సామాగ్రి గురించి వివరించారు. బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించుట, బాల-బాలికల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు, పాఠశాల అభివృద్ధిలో పేరెంట్స్ కమిటీలను భాగస్వామ్యం చేయుట., మొదలగు అంశాలపై ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పక పూర్తి చేయాలని, ఈ కార్యక్రమం పాఠశాల అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. ఈ నెల 29 వ తేదీ లోపు సామాజిక తనిఖీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్సి, సిఆర్పి సిబ్బంది పాల్గొన్నారు.










