Nov 09,2023 08:44

కేంద్ర ద్రోహానికి రాష్ట్రం వత్తాసా?
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:విశాఖ స్టీలు ప్లాంటు అమ్మకానికి వ్యతిరేకంగానూ, కడప స్టీలు ప్లాంటు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే సమర్థించాల్సిన ప్రభుత్వం నిర్బంధానికి దిగడం గర్హనీయమని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై వారు ఆందోళన చేస్తున్నారని, కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణం చేపడితే చదువుకున్న యువతకు ఉపాధి దొరుతుందని, అదేమీ చేయని కేంద్రానికి రాష్ట్రం వత్తాసు పలకడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజాకోర్టులో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని శ్రీనివాసరావు హెచ్చరించారు.