Sep 16,2023 16:40

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్‌ కాల్వ ద్వారా నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. నార్లపూర్‌ దగ్గర ఏర్పాటు చేసిన తొలి పంప్‌ హౌస్‌ స్విచ్‌ను ఆయన నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నార్లపూర్‌ పంప్‌ హౌస్‌ దగ్గర ఏర్పాటు చేసిన పైలాన్‌ను కేసీఆర్‌ ఆవిష్కరించారు. నార్లపూర్‌ రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణా జలాలకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ ద్వారా 6 జిల్లాల్లో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగు, 1226 గ్రామాలకు తాగునీరు సౌకర్యం లభించనుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్‌ యొక్క నిల్వ సామర్థ్యం 67.52 టీఎంసీలుగా కాగా.. 672 మీటర్ల లిఫ్ట్‌, 61.57 కిలో మీటర్ల. సొరంగం, 915 కి.మీ. ప్రాథమిక కాలువ నిర్మాణం చేపట్టారు. తొలి పంప్‌ హౌస్‌లోని మొదటి పంపు సిద్ధంగా ఉంది.. భూగర్భంలో పంప్‌ హౌస్‌ ఏర్పాటు చేశారు. కంట్రోలింగ్‌ సెంటర్‌ నుంచి ఎత్తిపొతలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సాయంత్రం కొల్లపూర్‌ సింగోటం చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా, సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.