విజయవాడ : అంగన్వాడీ మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల నిర్బంధ చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... సోమవారం 'చలో విజయవాడ'కు అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో .... పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు. బలవంతపు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ అంగన్వాడీల ధర్నాను భగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి రైల్వే స్టేషన్లు, బస్టాండుల నుండి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విజయవాడలో ... గుజ్జుల సరళా దేవి కళ్యాణ మండపంలో 150 మందిని, సింగ్నగర్ వడ్డెర కళ్యాణమండపంలో 100 మందిని, కండ్రిక లగడపాటి రాజగోపాల్ కళ్యాణ మండపంలో వందమందిని, ఆటోనగర్ టెక్నీషియన్ హాల్లో 50 మందిని, నక్షత్ర కన్వెన్షన్ లో 100 మందిని విజయవాడ ధర్నా చౌక్ నుండి 80 మందిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఈ నిర్బంధ చర్యలను సిఐటియు ఖండించింది. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.










