
హైదరాబాదులో మత ఉద్రిక్తతలు పునరావృతమవడం రాజకీయ నాయకులనే గాక సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆందోళన పరిచింది. బిజెపి మతతత్వ రాజకీయాల ముప్పును గురించి ఎంత చెబుతున్నా అలసత్వం చూపిన వారంతా ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజరు ఒకవైపు నుంచి పాదయాత్ర పేరిట బెదిరింపులు, మతతత్వ హెచ్చరికలు చేస్తుంటే మరోవైపు ఎంఎల్ఎ రాజాసింగ్ హద్దూ అదుపు లేని విద్వేష వ్యాఖ్యలతో వాతావరణం కలుషితం చేశారు. పాతబస్తీ లోనూ ఇతర చోట్ల కూడా పోలీసులు మొహరింపు, అనేక చోట్ల ఆంక్షలు అనివార్యమై నాయి. గత ఎనిమిదేళ్లుగా కొంత ప్రశాంతంగా వున్న నగరం ఉలిక్కిపడింది.
దీనికన్నా ముందే బండి సంజరు తన పాదయాత్రలో భగవద్గీత వివాదం రగిలించారు. అంతిమ యాత్రలలో భగవద్గీత రికార్డు వేయడం వల్ల అది చావుగీత అయిపోతోందని కోపగించారు. ఇకపైన అలా చేస్తే వైకుంఠరథం అనే శవశకటం టైర్లు కోసేస్తామని ఘనమైన కార్యక్రమం ప్రకటించారు. చాలాకాలంగా ఒక వర్గం ఛాందసులు భగవద్గీత చావు గీత అయిపోతుందని చేస్తున్న ఫిర్యాదును నెత్తికెత్తుకున్నారు. ఘంటసాల పాడిన గీత రికార్డులు వేయడం అందరూ చేస్తుంటారు. అర్థ శతాబ్దం పైగా ఈ పని చేస్తున్నా అదేమీ మృత్యుగీత కాలేదు. పైగా అంతిమ యాత్ర వంటి విషాద సమయంలో ఎవరు ఏమి చేయాలనేది మరణించిన వారికీ వారి కుటుంబ సభ్యులకూ మాత్రమే సంబంధించిన విషయం. భగవద్గీతపై అనేక అభిప్రాయాలూ అంచనాలు వున్నాయి. ఏది ఎలా వున్నా టైర్ల గాలికోయడం లాంటి పనులు రాజకీయ పార్టీ ప్రకటించడమేంటి? ఇతర మతస్తులతో పాటు హిందూ మతస్తులపై కూడా హిందూత్వ ఎలా దాడి చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. సహజంగానే దీనిపై విమర్శలు వచ్చాక కొంత తగ్గారు. మౌలికంగా అదే వాదనతో వుండి అవకాశం దొరికినప్పుడల్లా వినిపిస్తున్నారు. ఇటీవలనే వారి జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంలో యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సహా చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి మరుగుపడిన వివాదాన్ని మళ్లీ రగిలించే ప్రయత్నం చేశారు.
మునావర్ షో పేరిట విష ప్రచారం
ఈ మధ్యలోనే మునావర్ ఫరూఖ్ అనే రాజకీయ విదూషకుడు (స్టాండింగ్ కమెడియన్) హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్న షో ను అడ్డుకోవాలంటూ రాజాసింగ్ ప్రకటనలు చేశాడు. ప్రాణాలు పోయినా అడ్డుకుంటానని రెచ్చగొట్టాడు. ఈ ఫరూక్ ఎక్కడో రాముడిని అవమానించాడనేది ఆయన ఆరోపణ. అయితే సహజంగానే ఈ వాదనను ప్రభుత్వం, పోలీసులు తోసిపుచ్చారు. ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోననే హామీతో అతనికి అనుమతినిచ్చారు. అదేదో దేశద్రోహమైనట్టు సంఫ్ు పరివార్ శక్తులు రభస ప్రారంభించాయి. పోటీలు పడి ప్రకటనలు చేశాయి. ఈ కారణంగా మంత్రి కెటిఆర్ కూడా రంగంలోకి దిగి ఈ షోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్వేష రాజకీయాలను ఖండించారు. పోలీసులు కూడా భారీ భద్రత కల్పించి షో పూర్తిచేశారు. వచ్చిన ప్రేక్షకుల కన్నా వారి సంఖ్య ఎక్కువగా వుందని బిజెపి నేతలు వ్యాఖ్యలు చేశారు గాని సామాన్య ప్రజలేమీ పట్టించుకోలేదు. మీడియా చర్చలలోనూ మతతత్వ వాదనలను గట్టిగా తిప్పికొట్టడం, పాతబస్తీలో పోలీసుల కట్టుదిట్టం వీటి కారణంగా అల్లర్లు నివారించబడ్డాయి. సరిగ్గా అది సహించలేకనే రాజాసింగ్ రంగంలోకి దిగారు. ఫరూక్ షో సందర్భంలోనే ఆయన తమ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ లాగా చేయాల్సి వస్తుందని బెదిరించారు. ప్రవక్తపై దారుణ వ్యాఖ్యలు చేసిన నూపుర్ను బిజెపి అధిష్టానం బహిష్కరించాల్సి రావడం తెలిసిన విషయమే. అంతటితో ఆగని రాజాసింగ్ నిజంగానే ప్రవక్తను అవమానించే వీడియో విడుదల చేశాడట. పోలీసుల జోక్యంతో తర్వాత దాన్ని తొలగించారు గనక ఇప్పుడు ఎవరికీ కనిపించదు. ఆ పైన శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నందున రాజాసింగ్ను అరెస్టు చేశారు. అధిష్టానం సస్పెండ్ చేసింది. నిరసన పేరుతో బిజెపి వారు పెద్ద దుమారం లేపారు. తర్వాత సింగ్ను హైకోర్టు విడుదల చేసింది. ఏమంటే ఆయనను అరెస్టు చేసే సమయంలో సిఆర్పి 41 కింద నోటీసు ఇవ్వలేదనే సాంకేతిక కారణం చూపారు. ఇదేదో పెద్ద విజయమైనట్టు వారు హడావుడి చేస్తుంటే మరోవైపున నిరసన అంటూ మజ్లిస్ నేతలు కూడా ప్రదర్శనలు జరిపారు. దీంతో పాతబస్తీ భగ్గుమన్నది.
పాదయాత్ర ప్రహసనం
ఇంకోవైపున బండి సంజరు పాదయాత్రల లోనూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నందున ఆయన పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వీటిని కూడా సాంకేతిక కారణాలతో కోర్టు పక్కన పెట్టింది. ఆయన విద్వేష ప్రసంగాల వీడియో సమర్పించినా దాని వెంట వివరాలతో అఫిడవిట్ లేదని కారణం చూపింది. ఈ సమయంలో మీడియా కూడా గ్రీన్ సిగల్ వచ్చినట్టు ఊదరగొట్టింది. వ్యూహాత్మకంగా ఆలోచించిన పోలీసులు రాజాసింగ్ను నోటీసు ఇచ్చి అరెస్టు చేసి ఆపైన పి.డి చట్టం కింద నిర్బంధించారు. ఈ లోగా ఆయన మరో వీడియో విడుదల చేశారు. విచిత్రమే మంటే ఈ మొత్తం పరిణామాలలో బిజెపి రాష్ట్ర నాయకులెవరూ సింగ్ మాటలు తప్పని చెప్పలేదు. జాతీయ నాయకత్వం చూసుకుంటుందని అన్ని కోణాలు చూడాలని సన్నాయి నొక్కులు నొక్కారు. కోర్టు మాత్రం ఆయనను జైలుకు పంపింది. పోలీసులు, ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఏడాది వరకూ ఆయన బయిటకు వచ్చే అవకాశముండదు. గతంలోనూ గోరక్షణ పేరిట సింగ్ తీవ్ర విద్వేష వ్యాఖ్యలు చేసి సస్పెండయ్యారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బిజెపి నాయకత్వ చర్య వ్యూహాత్మకమే అనడానికి తదుపరి సంఘటనలే సాక్ష్యమిస్తాయి.
వీర్రాజు వినాయక వివాదం
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి ఎంపి జీవీఎల్ నరసింహారావు వరకూ వినాయక పందిళ్లకు ప్రభుత్వం ఆటంకం కలిగిస్తున్నదనే పల్లవి ఎత్తుకున్నారు. గత నిబంధనలే కొనసాగించడం తప్ప తామేవీ అదనంగా విధించలేదని ఎ.పి అధికారులు చెబుతున్నారు. అయినా సరే హిందూ మతానికి రక్షణ లేకుండా పోయిందని బిజెపి నేతల గగ్గోలు ప్రారంభించారు. బహుశా తెలంగాణ కన్నా వెనకబడకూడదనే వ్యూహం కావచ్చు. గతంలోనూ అంతర్వేదిలో రథం దగ్గర నుంచి రామతీర్థం, కపిలతీర్థం అంటూ రకరకాలుగా మతోద్రిక్తతలు పెంచేందుకు బిజెపి విఫలయత్నం చేసింది. ఆయా సందర్భాలలో టిడిపి, జనసేన కూడా ఇందుకు గొంతు కలిపాయి. మరోవైపున వైసీపీ తామే అసలైన మత రక్షకులమని నిరూపించుకునేందుకు తంటాలు పడింది. గుంటూరు జిన్నా టవర్పై రభస అందరికీ కళ్లు తెరిపించింది. చార్మినార్, జిన్నా టవర్ వివాదాలు బిజెపి నిజస్వరూపం తెలిసేట్టు చేశాయి. కానీ టిడిపి మాత్రం బిజెపితో పొత్తుకు తహతహలాడుతుండటం వైసీపీ లోపాయికారిగా అంటకాగడం పరిస్థితిని సంక్లిష్టం చేసింది. వినాయక వివాదంపై అశోక్ గజపతిరాజు వంటి వారు బిజెపి పాట పాడటం, వారి అనూకూల మీడియాలో అదే పనిగా చర్య పెట్టడం ప్రజలను గందరగోళపర్చే ప్రయత్నం తప్పమరొకటి కాదు.
తారలతో రాజకీయం
తెలుగుదేశం, జనసేనల వైఖరి ఆసరా చేసుకుని బిజెపి కేంద్ర నాయకత్వమే కొత్త ఎత్తుగడలు మొదలెట్టింది. మునుగోడు ఉప ఎన్నిక పేరిట హైదరాబాద్ వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకోవడం ద్వారా రాజకీయ సంకేతాలిచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రభావం ఎ.పి పైనా పడుతుందని ఎత్తు వేశారు. తర్వాత జె.పి నడ్డా కూడా నితిన్ను కలుసుకున్నారు. రామోజీరావు తోనూ భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి రాననీ, కనక బిజెపితో వెళ్లేది లేదని వారికి తేల్చి చెప్పారు. దాంతో చిన్నా చితక నటీనటులను, క్రీడాకారులను ఆకర్షించేందుకు తంటాలు పడుతూ రెండు రాష్ట్రాలలో ఏదో జరగబోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. స్వభావ సిద్ధమైన తమ మత రాజకీయాలను తీవ్రం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు గతానుభవాలు, భవిష్యత్ ముప్పులు పట్టించుకోకుండా బిజెపితోనే వెళ్లాలని టిడిపిపై ఒత్తిడి చేస్తున్నాయి. కెసిఆర్ వ్యతిరేకతను తప్పు పడుతున్నారు. కుంభకోణాలలో ఇరికిస్తారని బెదిరిస్తున్నారు. అమిత్ షా నేరుగా రామోజీని కలిసి మాట్లాడటమే ఇందుకు నిదర్శనర. అయితే టిడిపి మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా అమిత్ షాను కలిశారని కట్టుకథలు వదలి చర్చలు పెడుతున్నారు. మాటిమాటికి ఏవరో ఒకరిపై ఐ.టి, ఇ.డి, సిబిఐ దాడులు చేయిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతనే సంఘ పరివార్ భావజాలంతో తెలుగులో కార్తికేయ 2 నిర్మించి రికార్డు వసూళ్లు తెచ్చుకున్నారు.
ఎ.పి, తెలంగాణలపై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న సామదాన భేద దండోపాయాలకు ఇవన్నీ ఉదాహరణలు. వీటన్నిటిలో మరీ అనర్థదాయకమైంది మతతత్వ రాజకీయాలు రగిలించే విభజన విద్వేష రాజకీయాలు. వాటిని విస్మరించి బిజెపి ధ్రుతరాష్ట్ర కౌగిలి కోసం అర్రులు జాచేవారు దానికి పెద్ద మూల్యమే చెల్లించక తప్పదు. ఈలోగా ప్రజల సమైక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకోవడం పట్ల మరింత అప్రమత్తత వహించాల్సి వుంటుంది.
తె.ర