తెలంగాణ : బాడీ షేమింగ్ చేసేవారిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల చెన్నైలోని తాండయార్పేటలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను విద్యార్థులతో పంచుకున్నారు.
తమిళిసై సౌందర్రాజన్ మాట్లాడుతూ ... తన ఛాయ నల్లగా ఉందని, నుదురు బట్టతల ఉందని కొందరు పదే పదే విమర్శలు చేయడంపై మండిపడ్డారు. తనని నల్లగా అని అంటే మాత్రం అగ్గిలా మారుతానన్నారు. నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారని.. ఇలాంటి వారు ఓర్వలేనంత ఉన్నత స్థాయికెళతానని, వెలుతున్నానని తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోనని అన్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో సాయి పల్లవి అందంగా లేదన్న వార్తలపై గవర్నర్ ఘాటుగా స్పందించారు. సాయి పల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. గతంలోనూ తనకు ఇలాంటి అవమానం ఎదురైందన్నారు. ఎదుటివారిని ఎగతాళి చేసేవారికి తమ మనోభావాలు తెలియవని.. తాను కూడా చాలా బాధపడ్డానని అన్నారు. కానీ వాటిని ప్రతిభతో, కష్టపడి ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి ఉద్దేశం మహిళలను నిరుత్సాహపరచడం, బలహీనపరచడం, నాశనం చేయడం అని అన్నారు. మహిళలు తమ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.










