Nov 25,2022 13:44

అమరావతి : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ శుభవార్త అందించారు. ఎపి, తెలంగాణలో రహదారుల అభివృద్ధి పనులకు రూ.573 కోట్లను విడుదల చేశారు. కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జీకి రూ.436.91 కోట్ల మంజూరయ్యాయి. హైదరాబాద్‌ - భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణకు రూ. 136.22 కోట్లను గడ్కరీ విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌-భూపాలపట్నం సెక్షన్‌లో 163 వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-167 కేలో 2-4 లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు.
         ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ ఐకానిక్‌ బ్రిడ్జి రెండు రాష్ట్రాలకు గేట్‌ వేగా నిలుస్తుందని నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక, రూ.136.22 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 163 (హైదరాబాద్‌-భూపాలపట్నం)పై ములుగులో ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డు విస్తరణకు కూడా ఆమోదం తెలిపారు. లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి ప్రముఖ పర్యాటక స్థలాలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. ఈ రోడ్డు విస్తరణవల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయని గడ్కరీ పేర్కొన్నారు.