ప్రజాశక్తి-రాజమహేంద్రవరం యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పలువురు అన్నారు. సోమవారం నందం గనిరాజు జంక్షన్ వద్ద ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువత- హరిత' (గో గ్రీన్ చాలెంజ్) కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి ఇషా చావ్లా, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ 'హరిత - యువత' కార్యక్రమం పేరుతో ఎంపీ మార్గాని భరత్ రామ్ చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు. రాజమండ్రి ముఖ చిత్రాన్ని మార్చేందుకు జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎంపీ భరత్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వీరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తి వంతమైనదని సినీ నటి ఇషా చావ్లా అన్నారు. ఈ సభలో నగర కమిషనర్ దినేష్ కుమార్, వైసిపి నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, ఎన్వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










