ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన, ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటి లో సీటు సాధించినట్లు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి విశ్వప్రసాద్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మంచిగంటి బాల దుర్గా శిరీష, పోతా బత్తుల ఆనంద గోపాల్ లు మండల కేంద్రం ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2023, పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితం సాధించి, ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించడం మండలానికి గర్వకారణమన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మరింతమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, ఈ విద్యార్థులు వారికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎం.వెంకట్రావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎస్.సోమేశ్వరావు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.










