ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గోదావరి బాలోత్సవం, రాజమహేంద్రవరం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో వేసవి వినోదంకార్యక్రమం శుక్రవారం నుంచి చిన్నారుల ఆట పాటలతో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా క్యాంపు నిర్వాహకులు పిఎస్ఎన్.రాజు, పి.తులసి మాట్లాడుతూ ఏడాది పాటు చదువు, పరీక్షలు అంటూ ఒత్తిడికి గురైన చిన్నారులకు ఆ ఒత్తిడి నుంచి సేద తీరడానికి ఈ సెలవుల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ వేసవి వినోదం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఈ క్యాంపు ఉంటుందని తెలిపారు. చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదం కూడా అందించే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ 15 రోజుల పాటు చిన్నారులకు చిత్రలేఖనం, కార్టూన్, హ్యాండ్ రైటింగ్, పాటలు, కథలు చెప్పడం, కోలాటం, డాన్స్, డొమెస్టిక్ వర్క్, టీమ్ గేమ్స్, సెల్ఫ్ డిఫెన్స్, మంట లేని వంట వంటి అనేక అంశాల్లో అవగాహన కల్పిస్తారన్నారు. హ్యాండ్ రైటింగ్ నిపుణులు రాజేష్ ఖన్నా, డాన్స్ మాస్టర్ రమణ, కరాటే మాస్టర్ సుందర్, కార్టూనిస్ట్ శేఖర్, ఎం.విజయగౌరి, అనిత వివిధ అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కష్ణ మోహన్, కిరణ్మయి, స్వేచ్ఛ, నిశ్చల్ తదితరులు ఉన్నారు.










