ప్రజాశక్తి - పెరవలి
విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పి) నిడదవోలు నియోజకవర్గ కన్వీనర్ వెన్నపు సుధాకర్ డిమాండ్ చేశారు. మండలంలోని కానూరు గ్రామంలో జడ్పి ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్న సిహెచ్ గంగరాజుపై ఇప్పటికే హెచ్ఎంకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. స్కూల్ విద్యా కమిటి ఛైర్మన్ వీరమల్లు దుర్గ, ఉపాధ్యాయులు సిహెచ్ రామాంజనేయులు, కె.ధనరాజు, టి.వరలక్ష్మి, డి.దుర్గా నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి విద్యార్థులను విచారించి నివేదికను హెచ్ఎంకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విచారణలో ఉపాధ్యాయుడుపై ఆరోపణలు నిజమని తేలిందని తెలిపారు. అయినా నేటికీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా మెడికల్ లీవ్ ఇచ్చి హెచ్ఎం స్కూల్కు రాకుండా చేశారని ఆరోపించారు. తక్షణమే ఆ ఉపాధాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భావన మధు పూర్ణచంద్, బిఎస్పి నాయకులు బీర సత్య, సత్యవేణి, రాజ్, కొమ్మిశెట్టి రాము, గుమ్మపు చిత్రచేన్, నల్లి రమేష్, మర్రి లక్ష్మణుడు, కప్పల ఇజ్రాయిల్, మేలిమి శ్రీను తదితరులు పాల్గొన్నారు.










