ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
సినీ నటుడు నందమూరి తారకరత్న మృతికి పలువురు నివాళులరింపచారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో తారకరత్న సంతాప సభ టిడిపి నగర అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత తారకరత్న చిత్రపటానికి ఎంఎల్ఎ ఆదిరెడ్డి భవాని, మాజీ ఎంఎల్సి ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎంఎల్ఎ ఆదిరెడ్డి భవాని మాట్లాడారు. తారకరత్న తాను ఒకే స్కూల్లో చదువుకున్నామని, మంచి స్నేహితులమని గుర్తు చేసుకున్నారు. తారకరత్న మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషన్నారు. నందమూరి వంశానికి చెందిన ఆయన ఆ దర్పాన్ని ఏనాడు చూపించలేదన్నారు. అటువంటి వ్యక్తి దూరం కావడం బాధాకరమన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ ఎంఎల్సి ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తారకరత్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి టి.నరసింహారావు, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, ి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, తదితరులు పాల్గొన్నారు.










