ప్రజాశక్తి-కడియం : ఈ నెల 25, 26 తేదీల్లో రాజమండ్రిలో జరిగే గోదావరి బాలోత్సవాన్ని విజయవంతం చేద్దామని కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ ప్రతినిధులు చిలుకూరి శ్రీనివాసరావు, గొల్లపల్లి సత్యనారాయణ, సాకా అనిత సోమవారం కడియం మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఆహ్వానం అందించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలకి చెందిన వేలాది మంది బాలలు పాల్గొనే ఈ బాలోత్సవంలో పిల్లల సృజనాత్మకత, నైపుణ్యాలు, విజ్ఞానం పెంచే కార్యక్రమాలతో పాటు ఆనందం, ఆహ్లాదం, కలిగించే ఎన్నో సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలు, ఆటల పోటీలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. పిల్లల మనోవికాసానికి మైత్రి బంధాలకు ఆలవాలమయ్యే ఈ కార్యక్రమంలో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలనివారు పేర్కొన్నారు. ఎస్.కే.వి.టి. హైస్కూల్లో జరిగే ఈ కార్యక్రమంలో విజేతలైన బాలలకు బహుమతులు ప్రశంసా పత్రాలు కూడా అందిస్తారు. అలాగే పిల్లలకు భోజన ఏర్పాట్లు కూడా బాలోత్సవ కమిటీ సిద్దం చేసిందని వారు పేర్కొన్నారు.










