ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సేవలకు చిరునామాగా నిలుస్తోంది ఊమ్స్(ఒఎన్జిసి ఆఫీసర్స్ మహిళా సమితి). అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తుంది. పలు సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా కస్తూరిబాయి మహిళా సమాజం (వృద్ధాశ్రమం)లో 105 మందికి బెడ్షీట్లు, గ్రైండర్లు, క్యాస్రోల్, సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారు. ఈ సాయం పట్ల వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను తీరుస్తున్న ఊమ్స్కు ధన్యవాదాలు తెలిపారు. 'హృదయాళం' ఉచిత స్పెషల్ స్కూల్లో 50 మంది వికలాంగ పిల్లల కోసం కుర్చీలు, రిఫ్రిజిరేటర్ను అందించారు. చిన్నారులందరికీ వ్యక్తిగత పరిశుభ్రత కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఊమ్స్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జియాన్ బ్లైండ్ స్కూల్కు గ్రైండర్, క్యాస్రోల్, స్టీల్ సామగ్రి, వాటర్ కంటైనర్, నిత్యావసర వస్తువులను అందించారు. అలాగే పలుకు చెవిటి మూగ పిల్లల పాఠశాలకు రిఫ్రిజిరేటర్ను, ఇతర సామగ్రిని అందించారు. వ్యాఖ్యాత సాయంతో ఊమ్స్ బృందం చిన్నారులతో కాసేపు ముచ్చటించింది. పాఠశాలలో సౌండ్ ల్యాబ్ను పరిశీలించింది. అలాగే కస్తూరిబా బాలికల పాటశాలకు స్పీకర్లు, మైక్రోఫోన్లతో కూడిన సౌండ్ సిస్టమ్ను అందించింది. ఈ సందర్భంగా ఊమ్స్ అధ్యక్షులు అనుదా నారాయణ్కు, సభ్యులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల పాటు వివిద సేవాకార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు ఊమ్స్ అధ్యక్షులు అనుదా నారాయణ్ కృతజ్ఞతలు తెలిపారు.










