ప్రజాశక్తి-సీతానగరం 2019 ఫిబ్రవరి 14న పూల్వామాలో ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఎస్ఐ కె.శుభశేఖర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ హైస్కూల్ నుంచి మండల కేంద్రంలోని బస్టాండ్ వరకు యువత ర్యాలీ చేపట్టింది. మానవహారాన్ని చేపట్టి కొవ్వొత్తులు వెలిగించి ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శుభశేకర్ మాట్లాడుతూ జవాన్ల వీరమరణం ఎప్పటికీ వృథాగా పోదని, వారి త్యాగాన్ని ఈ నేల ఎప్పటికీ మరువదని చెప్పారు. నేటి యువత దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వీర జవాన్లను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ దేశాభివద్ధికి పాటుపడాలన్నారు. యువత సన్మార్గంలో నడుచుకుంటూ సమాజానికి ఉపయోగపడేలా విద్యారంగంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుందరపల్లి చైతన్య, పుప్పాల పోసి, తవిటికి విజయకుమార్, జక్కల భరత్, మల్లేష్, జయప్రకాష్, బుజ్జి, జక్కల భార్గవ్ పాల్గొన్నారు.










