
సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు
ప్రజాశక్తి-గన్నవరం : దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తూ పేదరికాన్ని పెంచుతున్న బిజెపికి రానున్న ఎన్నికల్లో ప్రజా కోర్టులో ఓటమి తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. శనివారం గన్నవరం మండలం బుద్ధవరం, అల్లాపురం పంచాయతీల పరిధిలో అమరజీవి చింతపల్లి పాపారావు వర్ధంతి సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లా పురంలో అమరవీరుల స్తూపంపై అవుటపల్లి సాంబయ్య జండా ఎగురవేశారు. పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న స్థూపంపై తాటి శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. పామర్తి నగర్ లో మల్లంపల్లి జయమ్మ, కొసరాజు నాగేశ్వరరావు స్తూపం వద్ద కళ్ళం వెంకటేశ్వరరావు, రాజీవ్ కాలనీలో మల్లంపల్లి ఆంజనేయులు, బుద్దవరంలో చింతపల్లి లక్ష్మారాయుడు స్మారక స్థూపం పై మాజీ సర్పంచ్ గండికోట దశరథ రామయ్య జండాలను ఎగురవేశారు. అదేవిధంగా సిపిఐ నాయకులు అమరవీరుల స్థూపాలపై పలుచోట్ల జెండాలు ఎగురవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బుధవారం లో జరిగిన సభలో వై నరసింహారావు మాట్లాడుతూ.. దేశాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాద బిజెపిని వదిలించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందన్నారు. మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే భారతదేశం మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఓటమి లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మోడీకి తోకలుగా వ్యవహరిస్తున్న రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజా కోర్టులో వీరు కూడా తగిన మూల్యం చెల్లిస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడంతోనే అమరజీవి చింతపల్లి పాపారావుకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. పేదల పక్షాన పోరాటాలు చేసిన చింత పల్లి నేటి యువతరానికి ఆదర్శమన్నారు.సిపిఐ నాయకులు పెద్దు వెంకటరత్నం మాట్లాడుతూ.. చింతపల్లి పాపారావు జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పెద్దు వాసుదేవరావు, మరియదాసు, తాతబ్బాయి, మిరప నాగేశ్వరరావు, విజయరావు తదితరులు పాల్గొన్నారు.