ప్రజాశక్తి - రాజానగరం
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో కలెక్టర్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జిఎస్ఎల్ మైదానంలో కలెక్టర్ ఎలెవన్, ఎస్పి ఎలెవన్ల మధ్య టి20 మ్యాచ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. కొత్త జిల్లా ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి కావొస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికారులు మంచి టీమ్ వర్క్తో పనిచేస్తున్నారన్నారు. ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలను టీమ్ వర్క్గా విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి క్రీడాల నిర్వహణ ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఇరు టీమ్లకు ఆల్దిబెస్ట్ చెప్పారు. అనంతరం ఎస్పి సిహెచ్.సుధీర్కుమార్రెడ్డి మాట్లాడారు. ఇటువంటి స్నేహ పూర్వక మ్యాచ్ ఏర్పాటు చేసిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. మ్యాచ్ అనంతరం జెసి ఎన్.తేజ్భరత్ విజేత జట్టు కలెక్టర్ ఎలెవన్కు ట్రోపీ అందించారు. పోటీ నిర్వహణ సజావుగా సాగడానికి సహకరించిన జిఎస్ఎల్ యాజమాన్యం చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావుకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత టాస్ గెలిచిన కలెక్టర్ మాధవీలత బౌలింగ్ ఎంచుకున్నారు. ఎస్పి-11 జట్టు 19.1 ఓవర్లలో 97 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ దిగిన కలెక్టర్ ఎలివెన్ జట్టు 11.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కలెక్టర్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ 31 పరుగులు సాధించి బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ జి.నరసింహులు, ఆర్డిఒలు ఎ.చైత్రవర్షిని, ఎస్.మల్లిబాబు, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు ఎంఎం.శేషగిరి, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.










