ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిపిఎస్ రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు రాశారు. వారం రోజుల పాటు ఈ పోస్టుకార్డు ఉద్యమం ఉంటుందని నాయకులు తెలిపారు. స్థానిక యుటిఎఫ్ హోమ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీ మేరకు పాత పింఛను విధానాన్ని కొనసాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57ను అనుసరించి 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ను చేపట్టామన్నారు. జిల్లా అధ్యక్షులు పి.జయకర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, నాయకులు ఇవిఎస్ఆర్.ప్రసాదరావు, విజయగౌరి, శ్రీమణి, రవిబాబు, రమేష్బాబు, తదితరులు పాల్గొన్నారు.










