ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కడియం జిల్లాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.829.44 కోట్లు మేర వైఎస్ఆర్ ఆసరాను మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. శనివారం వర్చువల్ విధానంలో 'వైఎస్ఆర్ ఆసరా-2022-23 ఏడాది మూడో విడతగా ఎస్హెచ్జి గ్రూపుల మహిళల ఖాతాకు జమ చేసే కార్యక్రమం భాగంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాకు చెందిన మహిళలకు మూడు విడతల్లో వరుసగా జమ చేసిన మొత్తం జిల్లాలో 2020-21 ఏడాది మొదటి విడతగా 32,313 ఎస్.హెచ్.జి గ్రూపులకు రూ.274.90 కోట్లు, 2021-22 ఏడాది రెండవ విడతగా 32,513 గ్రూపు లకు రూ.278.22 కోట్లు, ప్రస్తుత 2022-23 ఏడాది సంబంధించి మూడో విడతగా 32,491 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ 276.33 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా సుస్థిరమైన ఆదాయం రావాలనే అంకురార్పణతో వారి వ్యాపారాభివద్ధికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన రెడ్డి ఎంతో తోడ్పాటునిస్తున్నారన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నార న్నారు. ఇప్పుడు ఇస్తున్న మూడో విడత వైఎస్ఆర్ ఆసరా మొత్తాన్ని కలుపుకుని మొత్తంగా మూడు విడతల్లో రూ.78.94 లక్షలు అక్కచెల్లెమ్మలకు రూ.19,178.17 కోట్లు లబ్ధిని చేకూర్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, పీడీ డిఆర్డీఏ ఎస్. సుభాషిణి, జిల్లా, మండల సమైఖ్యా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్సార్ ఆసరా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వైసిపి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. ఆసరా వారోత్సవాల్లో భాగంగా కడియం మండలానికి సంబంధించి జేగురుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో, సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన శనివారం ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తొలుత గ్రామంలో భారీ సంఖ్యలో మహిళలు మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు.










