ప్రజాశక్తి-రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వినియోగదారుల దినోత్సవం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు జెవిఎస్వి ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వినియోగదారులు వారి హక్కులను తెలుసుకొని, వస్తువు కొని నష్టపోయినప్పుడు స్వయంగా ఫిర్యాదు చేసి సత్వరం పరిష్కారం లేదా నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు. అంతకుముందు డిసిపిసి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు అతిధులను వేదిక మీదకు ఆహ్వానించి కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పౌరసరఫరాల అధికారి పి.ప్రసాద రావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ వినియోగదారుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలిపారు. లీగల్ మెట్రాలాజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎఎస్.రాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ రుక్కయ్య, అడిషనల్ డిఎంహెచ్ఒ డాక్టర్ ఎన్.వసుందర, ఎలక్ట్రిసిటీ ఎఇఇ ఫణి కుమార్, జిల్లా రవాణా శాఖ కృష్ణ కుమార్, డిప్యూటీ స్కూల్స్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారి డిపార్ట్మెంట్ల ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిపిసి సభ్యులు వీర శేఖర్, డివికె రమేష్, వైకె.శ్రీనివాస్, అనంతరావు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, విఆర్ఒలు, వార్డు వాలంటీర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రోలాజి మరియు ఆహార భద్రత వారు స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో కల్తీ ఏవిధంగా తెలుసుకోవచ్చో హాజరైన వినియోగదారులకు వివరించారు.










