ప్రజాశక్తి-తాళ్లపూడి ఆపదలో ఉన్నవారు ఎంత దూరంలో ఉన్న సరే ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని గజ్జరం గ్రామ సర్పంచ్ డాక్టర్ గండి రాంబాబు అన్నారు. సోమవారం పలువురు అగ్నిప్రమాద బాధితులకు సాయం అందించారు. గజ్జరం గ్రామానికి చెందిన 20 కుటుంబాల కార్మికులు పొగాకు పనుల నిమిత్తం దగ్గరలోని వాదాలకుంట గ్రామానికి బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. వలసకి వెళ్లిన గ్రామంలో ఈ కుటుంబాలు నివసిస్తున్న పూరి గుడిసెలు ఆదివారం సాయంత్రం అగ్నికి ఆహుతి అవడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్తో పాటు మరికొందరు సోమవారం పాదాలకుంట గ్రామానికి వెళ్లి నిత్యవసర వస్తువులు ఇతర సామాగ్రి అందించారని సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ నిత్యవసర వస్తువులు దుప్పట్లు టవల్స్ బట్టలు అందించగా, వైసిపి నాయకులు వల్లభని శ్రీహరి రూ.ఐదు వేల నగదును, పాస్టర్ ఎన్వి.శేఖర్ బియ్యం, కూరగాయల అందించారు.










