ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎయిడ్స్ భారిన పడకుండా ఎటువంటి జీవనశైలి అలవర్చుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే వాటిపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత పిలుపునిచ్చారు. స్థానిక వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు గురువారం మారధాన్ 5 కె రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎయిడ్స్ బారిన పడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. యువత ఎక్కువగా వివిధ సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వాడుతుండటం జరుగుతోందని అన్నారు. ఒక మంచిని, మేలు చేకూర్చే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువతలో ఎయిడ్స్ కంట్రోల్ పై అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపు నిచ్చారు. వర్షం పడుతున్న 5 కె రన్లో పెద్దఎత్తున యువత పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల, ఎస్కెవిటి డిగ్రి కళాశాల, కొవ్వూరు, సీతానగరం ప్రభుత్వ డిగ్రి కళాశాల, నిడదవోలు ఎస్విఆర్ ప్రభుత్వ డిగ్రి కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు. 5 కె మారథాన్ పరుగులో ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు, తతీయ బహుమతి రూ.5 వేల రూపాయలు, మరో ఏడుగురికి ప్రోత్సాహక బహుమతులు రూ.1000/-లు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఒ డాక్టర్ కె. వేంకటేశ్వర రావు, డిఎల్ఎటిఒ డాక్టర్ ఎన్. వసుంధర, జిల్లా స్పోర్ట్స్ కోచ్ బిఎంఎం శేషగిరి, ఎన్ఎల్ఈపి డాక్టర్ లక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు.










