ప్రజాశక్తి - ధవళేశ్వరం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేజర్ పంచాయతీ అయిన ధవళేశ్వరం నేడు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం గ్రామ విస్తత సమావేశం కర్రి రామకష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అరుణ్ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ చాలా అధ్వానంగా ఉందన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే శానిటేషన్ పనులను సక్రమంగా నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ప్రశాంతంగా ఉండే ధవళేశ్వరం ప్రస్తుతం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిపోయిందన్నారు. ప్రజలకు రక్షణ కరువైందన్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో పది మందిపైగా దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీస్ శాఖ శాంతి భద్రతలను పునరుద్దరించే ప్రత్యేక ప్రణాళికని రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. యువతను గంజాయి మాఫియా ఉచ్చు నుంచి విడదీయాల, వారి జీవితాలను కాపాడాలని కోరారు. దానికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా చర్చించి అమలు చేయాలని కోరారు. సిపిఎం నగర్ కార్యదర్శి బి.పవన్, సీనియర్ నాయకులు ఎస్ఎస్.మూర్తి, టి.సావిత్రి, పడాల రామకష్ణ, పేరయ్యలింగం, ఉమామహేశ్వరరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.










