ప్రజాశక్తి-దేవరపల్లి చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని నమ్మిన వ్యక్తి జగన్ మామ అని మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం దేవరపల్లిలో అంబటి సత్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్లో అమ్మఒడి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి జగనన్న అమ్మ ఒడికి సబంధించి వారి ఖాతాల్లో నగదు జమ చేసిన సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడారు. మన రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదనే ఏకైక లక్ష్యం విద్య విధానంలో జగనన్న విన్నూత్న మార్పులు తీసుకుని వచ్చారన్నారు. తల్లిదండ్రుల ఆశ్యఆలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో నాడు-నేడు పనులు, అమ్మఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందచేస్తున్న ఈ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్కూల్స్ కూడా ప్రభుత్వ బడులతో పోటీపడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దు తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన, సిబిఎస్ఇ సిలబస్ అనుసంధానం చేశా మన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు ఇంగ్లీష్లో నైపుణ్యం సాధించేలా పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశ పట్టామన్నారు. ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ జగన్ మామ కురుపాం గ్రామం నుంచి అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారన్నారు. గతంలో నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి ఉండేదు కాదని, నేడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత నాడు నేడు కింద పాఠశాలల ఆధునీకరణ మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పుస్తకాలు, డ్రెస్, షూస్ ముందుగానే అందించడం ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ విద్యకు భద్రత అందించాలనే లక్ష్యంతో అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంఎల్ఎ తలారి వెంకట్రావు మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ జగనన్న సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, డిఇఒ ఎస్.అబ్రహాం, ఎంపిపి కెవికె.దుర్గారావు, ఎఎంసి చైర్మన్ గన్నమని జనార్థనరావు, సర్పంచ్ కడిమి వీరకుమారి, నరహరశెట్టి రాజేంద్ర బాబు, కవ్వాల వరలక్ష్మి, జెడ్పిటిసి చిగురుపల్లి సామ్యేలు, హెచ్ఎం కె.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.










