ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కంటింజెంట్ వర్కర్లుగా పనిచేస్తున్న స్కూల స్వీపర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్ స్కూల్ స్వీపర్స్ యూని యన్ నాయకులు బుధవారం స్కూల్స్ డిఐ బి.దిలీప్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలపై అధికారుల దష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, మున్సిపల్ స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకులు ఝాన్సీ మాట్లాడుతూ 30, 40 ఏళ్లుగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో కంటెంజెంట్ వర్కర్లుగా పని చేస్తున్న స్కూల్ స్వీపర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మున్సిపల్ స్కూల్స్ని జిల్లా విద్యా శాఖలో విలీనం చేసిన నేపథ్యంలో స్కూల్స్ ఆయల ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడిందని అన్నారు. మున్సిపల్ అధికారులు, విద్యాశాఖల మధ్య సమన్వయ లోపంతో స్కూల్ స్వీపర్లు ఏప్రిల్ నెల జీతాల బిల్లులు కూడా మున్సిపల్ అధికారులుగానీ, విద్యా శాఖ అధికారులు గానీ తీసుకోలేదన్నారు. పార్ట్ టైం వర్కర్లుగా నియమించినప్పటికీ ఉదయం 8 నుంచి సాయంత్రం స్కూల్ ముగిసేవరకు పని చేయి స్తున్నారని, జీతం మాత్రం పార్ట్ టైం వర్కర్కు ఇచ్చే రూ.4000 మాత్రమే ఇస్తున్నారన్నారు. కార్పొరేషన్, విద్యా శాఖ అధికారులు సమన్వయంతో స్కూల్ స్వీపర్ల వేతన బాలాయాలు ఇవ్వాలని, ఏప్రిల్ నెల జీతాల బిల్లులు తీసుకుని జీతాలు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీసవేతనం రూ.12000 ఇవ్వాలని కోరారు.










