Dec 06,2020 11:52

             గుజరాత్‌ నుంచి ముంబైకు వలస వచ్చిన హిందూ కుటుంబానికి చెందినావిడ తీస్తా సెత్లవాద్‌. మైనార్టీల సమస్యల్ని వెలుగులోకి రానివ్వకుండా మౌనం వహిస్తోన్న మీడియా కళ్లు తెరిపించేందుకు ఆమె పెన్నును ఎక్కుపెట్టింది. అలా ఆమె కలం నుంచి వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన సందర్భంలో ఆమె అనుభవాల్ని రంగరించి రచించినదే... 'నేనొక నదిని... నా పేరు తీస్తా' మీడియా నోరునొక్కి, జర్నలిజానికి తూట్లు పొడుస్తోన్న తరుణంలో ఆమె చేపట్టిన బాధ్యత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతం.
             కుటుంబం నుంచి స్వాతంత్య్ర భావాల్ని అందిపుచ్చుకొన్నారు తీస్తా. తండ్రి ఓ నాస్తికుడైన లాయర్‌. ఆమె విశాల ప్రాపంచిక దృక్పథం కలిగిన వారి నుంచి ప్రేరణ పొందిన స్త్రీ. ఆమె తన ఇష్టమైన ఆమెదో స్వేచ్ఛా పోరాటం !
             జర్నలిజంలోకి 1983లో ప్రవేశించారు. సరిగ్గా అదే సమయంలో దేశంలో మత శక్తుల వేళ్లు బలపడుతున్నాయి. వృత్తికీ, ప్రవృత్తికీ దగ్గరైన జావీద్‌ను వివాహం చేసుకొన్నారు.
           సమాజం పట్ల బాధ్యత కలిగిన వారిరువురి ఆలోచనలు ఒక్కటిగా అడుగులు వేశాయి. ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం వెతికాయి. అందుకోసమే 'కమ్యూనలిజం కాంబేట్‌' అనే పత్రికను ప్రారంభించారు. కోర్టు తీర్పుల్లో వెలువడే న్యాయం అన్నివేళలా సరైనది కాదని భావించారామె. దీంతో ఆమె జర్నలిజం నుంచి యాక్టివిజానికి కార్యాచరణను మొదలుపెట్టారు.
          పథకం ప్రకారం క్రూరమైన నేరాలను చేయించి, ఆ కుట్రల్ని తుడిచిపెట్టే ప్రయత్నాల్ని వెలుగులోకి తెచ్చారు. 1992 ముంబై దాడులు, 2002 గోద్రా తదనంతర దాడులలో మైనార్టీ వర్గాల రక్షణకు తీస్తా చేసిన కృషి ఎందర్నో ఆలోచనలో పడేసింది. దళితులు, ఆదివాసీ, మైనార్టీలపై హింసా, హత్యాకాండలకు పాల్పడిన అంశాల్ని.. హిందూత్వం చేపట్టిన దుర్మార్గాల్ని ధైర్యంగా ఎత్తి చూపారు. సామాన్య ప్రజల పట్ల, మైనార్టీల పట్ల దుర్మార్గ పూరితంగా వ్యవహరించిన తీరును సైతం ఆమె రాతలతో ఎండగట్టే ప్రయత్నాన్ని చేశారు. పాలకులు, మీడియా, ప్రజల్ని పక్కదారి పట్టించే వైనంలో ఆమె రచించిన ఎన్నో వ్యాసాలు ప్రశ్నిస్తూ.. సవాళ్లను విసిరాయి. ఆ రాజకీయ వ్యాసాలు అనువాదాలకు దారితీసి, ఆలోచింపజేస్తూ వాస్తవాల్ని తెలిపేలా చేశాయి.
          అధికారం చేజిక్కించుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకున్నారో అన్ని చీకటి అంశాల్ని బట్టబయలు చేస్తూ... 'ఐ యాం ఏ ట్రోల్‌' పుస్తకంలో తెలిపారు. తద్వార జర్నలిజానికి నిజమైన అర్థాన్ని ఆమె చాటారు. ఆ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టారామె. తనకొచ్చిన బెదిరింపులకు ఎక్కడా ఆమె తలొగ్గలేదు. దీనికంటే ముందు 'గుజరాత్‌ ఫైల్స్‌' అనే ఆమె పుస్తకం వెలుగుచూసింది. ఇందులో మతోన్మాదానికి అద్దం పట్టే అంశాలతో పాటు ఆనాటి వర్థమాన రాజకీయ పరిస్థితుల్ని బహిర్గతపరిచారామె. ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే సందర్భంలో రాజకీయ వ్యాఖ్యానంతో 'ఫుట్‌ సోల్జర్‌ ఆఫ్‌ ది కాన్స్‌టిట్యూషన్‌' అనే పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే సందర్భంలో ఎదురయ్యే ప్రమాదాకర అంశాల్ని ఇందులో ఆమె పొందుపరిచారు. వాటిని వెలుగులోకి తెచ్చే సందర్భంలో ఆమె చేసిన ప్రతి ప్రయత్నం ఈ పుస్తకంలో వివరించారామె.
         తీస్తా వృత్తి జీవితానికి అర్థం చెప్పే విధంగా ఆమె రాతల్ని చూడొచ్చు. ప్రధానంగా ప్రజాస్వామ్యానికి గండిపడుతోన్న తరుణంలో ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడేలా ఆమె చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. నయా ఉదారవాద విధానాలు త్వరితగతిన అమల్లో పెడుతూ... కార్పొరేట్ల చెరల్లోకి, మతోన్మాద శక్తుల్లోకి మనదేశం పూర్తిగా బంధీగా అయిపోతున్న పరిస్థితి. దీన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఎదుర్కొగలిగితే.. దేశాన్ని రక్షించుకోవచ్చు. అది దేశంలోని ప్రతి ఒక్క పౌరుడూ తన బాధ్యతని గుర్తించిన నాడే సాధ్యమని అంటారామె.
- ఐక్యత