Jul 23,2022 16:39

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ 10వ వర్ధంతి సభ శనివారం కర్నూలు నగరంలోని భగత్ సింగ్ నగర్ మద్దయ్య భవన్ లో ఐద్వా నగర కార్యదర్శి కె.అరుణ అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఐద్వా సీనియర్ నాయకురాలు  పి.నిర్మల, సిపిఎం నగర కార్యదర్శి టీ.రాముడు మాట్లాడుతూ కెప్టెన్ లక్ష్మీసెహగల్ జీవితం దేశానికే ఆదర్శం అన్నారు. ఆమె జీవితంలో దేశం కోసం సమాజం కోసం చేసిన కృషిని వివరించారు. లక్ష్మీ సెహెగల్ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆనాడు సుభాష్‌ చంద్రబోస్ సహచరినిగా తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో కడదాకా సాగిన వీరవనితని అన్నారు. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ ప్రముఖ సంఘ సేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు. ఈమె భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ. ఈమె తండ్రి స్వామినాథన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది. తల్లి ఎ.వి.అమ్ము కుట్టి సామాజిక సేవా కార్యకర్త. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహిష్కరణ, మధ్యనిషేధం వంటి జాతీయ పోరాటాలలో పాల్గొన్నారు.1938లో మద్రాసు వైద్య కళాశాలలో ఎం.బి., బి.ఎస్. గైనకాలజీ పూర్తయిన తరువాత 1940లో సింగపూర్ వెళ్ళి, అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి, స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలందించారు. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర్యోద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ మహిళాదళాల్లో చేరి, క్యాప్టెన్ హోదా పొంది, డాక్టర్‌గా వైద్యసేవలు కూడా అందచేశారు. ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఝాన్సీ రెజిమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.లక్ష్మీ సెహగల్ 1947లో లాహోర్ కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ ను లాహోర్‌లో వివాహం చేసుకొని కాన్పూర్ లో స్థిరపడి కాన్పూర్ ప్రజలకు వైద్యసేవలందించారు. స్వాతంత్ర్యానంతరం భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు.1971లో, సీపీఎం తరఫున లక్ష్మీ సెహ్‌గల్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1998లో ఈమెకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయబడింది. 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగి 88 సంవత్సరాల వయసులో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మతోన్మాదంపై దేశవ్యాప్తంగా ప్రచారం జరిగే విధంగా సభలను నిర్వహించారు. దేశం కోసం ప్రజల కోసం కెప్టెన్ లక్ష్మీ సెహెగల్  చేసిన కృషి దేశానికే ఆదర్శం అని అన్నారు. ఈ వర్ధంతి సభలో సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి జె. ఎం .డి .ఉస్మాన్ భాష, ఐద్వా నాయకురాళ్ళు యం.కుమారి, పర్వీన్, శాంతమ్మ, సత్యమ్మ,మైముదా,నాగలక్ష్మి, లావన్య,  స్థానిక మహిళలు పాల్గొన్నారు.