Jun 09,2023 10:49

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : చించినాడ దళిత భూముల నుండి ఇటుక బట్టీలకు, ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లారీలను మేడపాడులో చించినాడ దళితులు పట్టుకున్నారు. నరసాపురం జగనన్న కాలనీలకు మట్టి పేరున అనుమతులు ఉన్నాయని చెప్పి ఇలా యథేచ్ఛగా ప్రైవేటుగా గోదావరి జిల్లాల్లో మట్టి అమ్ముకుంటున్న ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్‌ లపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఏ నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. దళితుల తలలు పగలకొట్టి మహిళలపై సైతం దాడి చేసి అక్రమ కేసులు పెట్టి మట్టి అమ్ముకుంటున్న ప్రసాద్‌ రాజు, కవురు శ్రీనివాసులను ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి పదవులకు అనర్హులుగా స్పీకర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై దాడి చేసి మట్టి అమ్ముకునే ప్రసాదరాజు, కవురు శ్రీనివాసులపై మాల మహానాడు, ఎమ్మార్పీఎస్‌ దళిత సంఘాలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మట్టి దోపిడీకి ప్రసాద్‌ రాజు, కవురు శ్రీనివాసులకు సహకరించి మట్టి మాఫియాలో భాగస్వాములైన కలెక్టర్‌, ఎస్‌పి, డిఎస్‌పి లను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై దాడి చేసి మట్టి అమ్ముకునే ప్రసాదరాజు, కవురు శ్రీనివాసులకు పదవులు ఇచ్చి, వాటాలు తీసుకుంటున్న జగన్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుడు కాదని నిమ్మల డిమాండ్‌ చేశారు.