ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో అపర భగీరధుడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. కాటన్ దొర భక్తుడు, ప్రముఖ రైతు సత్తి భాస్కర్ రెడ్డి (కందరెడ్డి) ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలను ఒక ఉత్సవంలా జరుపుతారు. ఈ ఏడాది కూడా కందరెడ్డి గ్రామంలోని వేదపండితులను పిలిచి పూజలు జరిపించారు .తన ఇంటి ముందు నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం, క్షీరం, నదీజలాలతో అభిషేకించారు. అలానే పట్టు వస్త్రాలను సమర్పించారు. గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనీటి విందు ఇచ్చారు. వేద పండితుల సాక్షిగా మంత్రోచ్ఛరణలు మధ్య జయంతి వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, మాజీ సర్పంచ్ లు చిట్టూరి అమ్మిరాజు, దూడల నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్, తాతపూడి బాబీ, ఈదర నందబ్బు, రైతులు కంటిపూడి తాతారావు, యన్నమని లక్ష్మీపతి, కొండ, సత్తి నాగిరెడ్డి, దూడల సత్తిబాబు, తదితరులు కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాత సుఖీభవ అని నినదించారు. ఈ సందర్భంగా రైతు కందరెడ్డి మాట్లాడుతూ ... ధవలేశ్వరం వద్దకు కాటన్ బ్యారేజ్ నిర్మించక ముందు వరద మంపులతో గోదావరి రైతులు అల్లాడిపోయేవారన్నారు. కరువు కాటకాలు అనుభవించేవారన్నారు. బ్రిటిష్ ఇంజనీర్ గా మన దేశానికి వచ్చిన కాటన్ దొర బ్యారేజ్ నిర్మించడం ద్వారా రైతులపాలిట ఆపద్భాందవునిగా మారారన్నారు.










