ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శమని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజులు తెలియజేశారు. బుధవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. స్వామి వివేకానంద దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తిన్నారు. ఆనాడు ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని చిన్నచూపు చూసే క్రమంలో చికాగోలో వారి ప్రసంగం ద్వారా భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుముడింపజేశారని తెలిపారు. ఆయన చెప్పిన సూక్తులు ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువతీ, యువకులు నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ షేక్ అబ్దుల్లా, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు టి.లక్ష్మీనారాయణ, కార్యదర్శి దండే రవికుమార్, మాజీ అధ్యక్షులు ఏ.వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










