యోగాతో మానసిక ఒత్తిడులు దూరం
కేంద్రియ విద్యాలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం.రాజేశ్వరరావు
విజయవాడ : జీవితంలో మానసిక ఒత్తిడులు, ఆందోళనలను అధిగమించడానికి యోగానే సరైన మార్గమని కేంద్రియ విద్యాలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం.రాజేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ బిఆర్టిఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం-1, రాయనపాడు కేంద్రీయ విద్యాలయం-2 8,9 తరగతుల విద్యార్థులకు చారిత్రక ఉండవల్లి గుహల వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్నినుద్దేశించి ఎం.రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యోగాతో క్రమ శిక్షణతోపాటు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిడ్యూడ్ అలవడతాయని వివరించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గంపలగూడెం మండలం తోటమూల మోడల్ స్కూల్ మ్యాథ్స్ లెక్చరర్, సహజయోగ ట్రైనర్ డి.జయశంకర్ తరగతులను బోధించారు. రాయనపాడు కేంద్రీయ విద్యాలయం-2 ప్రిన్సిపల్ డాక్టర్ కె.కృష్ణ యోగా ప్రాధాన్యతను వివరించారు. కేంద్రీయ విద్యాలయం-1 పిఇటి నసీం, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ బి.సీతారామ్ పర్యవేక్షించారు.










