ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎస్సీ వర్గీకరణకు హామీఇస్తే బిజెపి పతనం తప్పదని, మందకృష్ణ మాదిగ తలపెట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని రావడం సిగ్గుచేటని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాల మహానాడు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఎన్నికల డ్రామా ఆడటానికి వస్తున్నారని విమర్శించారు. మరి మాలల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధమైన అంశంపై హామీ ఎలా ఇస్తారో చూస్తామని హెచ్చరించారు. ఉషామేహ్రెన్ కమిషన్ నివేదికను జాతీయ ఎస్సీ కమిషన్ చెత్త బుట్టలో వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిధిని దాటిన అంశమని, వర్గీకరణ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 ఉల్లంఘన అని ఏనాడో సుప్రీం కోర్టు తెలిపిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం వివిధ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. బిజెపి మాదిగలకు ఎన్ని పదవులు ఇచ్చిందో చూపాలని తెలిపారు. బిజెపికి మాదిగల మీద ఎనలేని ప్రేమ పుట్టుకోస్తోందని, అది మాదిగలు గమనించాలని కోరారు. నవంబర్ 11న బ్లాక్ డేగా ప్రకటిస్తూ, వర్గీకరణపై ప్రధాని ప్రకటన అనంతరం బిజెపి కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా గౌరవాధ్యక్షులు రాజోలప్ప, జిల్లా అధ్యక్షులు మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ పరమేష్, యువదళం యువ నాయకులు బలరాం, రాము, రఘు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రంగయ్య