Nov 10,2023 19:50

నేమకల్లులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని అన్ని గ్రామాల్లోనూ వలసలు వెళ్లకుండా తక్షణమే ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఎపిఒ మాధవ శంకర్‌ తెలిపారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేమకల్లు, సంగాల గ్రామాలలో కొండ రాయి కొట్టుకునే వారు మాత్రమే వలస వెళ్లారని తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసుకునే వారు ఎవరూ వెళ్లడం లేదని, గ్రామంలో ఉపాధి పనులు విరివిగా సాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరువు మండలాల్లో తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామంలోనైనా సరే వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మారుతి ప్రసాద్‌ పాల్గొన్నారు.