ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వలస బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది కిక్కిరిసిన పడవలలో వెళ్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారుగా కొన్ని లక్షల మంది తెలుగు వారు కువైట్, యుఎఇ, ఒమన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఇరక్ దేశాలలో వుంటున్నారు. అయినవారిని విడిచి పరాయి దేశాలలో అనేక కష్టాలను ఎదుర్కుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇక ఒక దేశం లోపల జరిగే వలసల సంగతి సరేసరి. లాక్డౌన్ కారణంగా పని లేక సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి...అక్కడ పనుల్లేక తిరిగి పట్టణాలు రావడానికి వారు పడ్డ బాధలు వర్ణనాతీతం. గత ఏడాది విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం స్వదేశాలను వదిలి విదేశాలకు వలస వెళ్లిన వారిలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. వలసదారుల నంబర్-1 అడ్డాగా అమెరికా మారిందని ఐక్యరాజ్యసమితి తేల్చింది. జర్మనీ, సౌదీ అరేబియా తరువాతి స్థానాలలో నిలిచాయి. గత పదేళ్లలో ప్రపంచ వలసదారుల జనాభా 23 శాతం మేర పెరిగిందని పేర్కొంది.
(నేడు అంతర్జాతీయ
వలసదారుల దినోత్సవం)
- జాజుల దినేష్, ఎంఏ(బీఈడీ)సెట్,
ఉస్మానియా విశ్వవిద్యాలయం.










