మాట్లాడుతున్న కమిషనర్
విధుల్లో నిబద్ధత పాటించాలి
నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల కార్యదర్శులు విధుల్లో నిబద్ధత పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత సూచించారు. స్థానిక 18/1, 18/2,17/1 సాయి నిలయం వీధి, కావేరి నగర్, వడ్డిపాలెం సచివాలయాలను మంగళవారం కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో అందిస్తున్న వివిధ సంక్షేమ పధకాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలను కార్యదర్శులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం క్షేత్ర స్థాయిలో ఓటుకు ఆధార్ లింక్ చేసే కార్యక్రమాన్ని పటిష్టంగా పూర్తి చేయాలన్నారు. వాలంటీర్ల ద్వారా అర్హులైన అందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు మంజూరు చేయించాలని సూచించారు. వాలంటీరు పరిధిలోని ప్రజల అనారోగ్యాలకు సంభందించిన వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స గురించి ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు. సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలను అర్హులైన ప్రజలకు మరింత చేరువ చేయాలని కోరారు. ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ను విధుల నిర్వహణలో సచివాలయ కార్యదర్శులు తప్పక ధరించాలని కమిషనర్ ఆదేశించారు.










