Jul 11,2021 16:03

భోపాల్‌ : విద్యుదాఘాతంతో ఒకే ఇంట్లో ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఆదివారం మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని ఛత్తర్‌పూర్‌ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా ఆ ఆరుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని జగన్‌ అహిర్వార్‌ కుటుంబం ఓ సెప్టిక్‌ ట్యాంక్‌ను నిర్మిస్తోంది. పని చేసేటప్పుడు వెలుతురు కోసం అందులో ఓ విద్యుత్‌ బల్బును ఉంచారు. పనంతా పూర్తయిపోవడంతో నిర్మాణ వ్యర్థాలను బయటకు తీసేందుకు జగన్‌ అహిర్వార్‌ కుమారుడు అందులోకి దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని రక్షించే క్రమంలో మొత్తం ఆరుగురు కుటుంబసభ్యులు విద్యుదాఘాతానికి గురయ్యారు. విద్యుత్‌ సరఫరాను ఆపేసి వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పారన్నారు. మృతులు నరేంద్ర (20), రామ్‌ ప్రసాద్‌ (30), విజరు (20), లక్ష్మణ్‌ (55), శంకర్‌ అహిర్వార్‌ (35), మిలాన్‌ (25)గా గుర్తించారు.